శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశాఖ పర్యటన అప్డేట్స్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ మరియు పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. జూ పార్క్లో జంతు సంరక్షణ, మౌలిక వసతులు, నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు.
జిరాఫీల దత్తత ప్రకటన
తన తల్లి శ్రీమతి అంజనా దేవి గారి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్టు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ రెండు జిరాఫీలకు ఏడాదిపాటు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని వెల్లడించారు.
జంతు సంరక్షణపై కార్పోరేట్ సంస్థలకు పిలుపు
జంతు సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ కోసం కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సమాజ బాధ్యతగా జంతు సంరక్షణకు సహకరించాలని ఆయన పేర్కొన్నారు.
నూతన ఎలుగుబంటి ఎంక్లోజర్ ప్రారంభం
జూ పార్క్లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎంక్లోజర్ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. జంతువులకు అనుకూల వాతావరణం కల్పించేలా ఈ ఎంక్లోజర్ రూపకల్పన చేసినట్లు అధికారులు వివరించారు.
జంతు ఎంక్లోజర్ల పరిశీలన
జూ పార్క్లోని నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాలు ఉన్న ఎంక్లోజర్ల వద్దకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి, వాటికి అందిస్తున్న ఆహారం, వాటి పేర్లు, సంరక్షణ విధానాలపై జూ క్యూరేటర్ను అడిగి తెలుసుకున్నారు.
అలాగే ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించి వాటికి స్వయంగా ఆహారం అందించారు. ఈ సందర్భంగా జంతు శాలల్లో ఆహారం అందించే సమయంలో జూ నిబంధనలు పూర్తిగా పాటించారు.
కంబాలకొండ ఎకో పార్క్ లో నగర వనం ప్రారంభం
అనంతరం కంబాలకొండ ఎకో పార్క్లో నగర వనాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎకో పార్క్లోని చెక్క వంతెనపై కెనోపీ వాక్ చేస్తూ మార్గం మధ్యలో ఉన్న మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.