కోటప్పకొండ – కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి [పవన్ కళ్యాణ్] కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి భక్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కోటప్పకొండ – కొత్తపాలెం గ్రామాల మధ్య పంచాయతీరాజ్ శాఖ నిధులతో నిర్మించిన నూతన రహదారిని ఆయన గురువారం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
రూ.3.9 కోట్లతో 8 కిలోమీటర్ల రహదారి
ఈ రహదారిని రూ.3.9 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో మొత్తం 8 కిలోమీటర్ల మేర నిర్మించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ రోడ్డు అవసరాన్ని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్, శివరాత్రి ఉత్సవాల లోపే రహదారి పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, ఆ హామీని ఆచరణలో నిలబెట్టుకున్నారు.
భక్తులు, రైతులు, విద్యార్థులకు లబ్ధి
ఈ రోడ్డుతో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సుమారు లక్షన్నర మంది భక్తుల ప్రయాణ కష్టాలు తొలగనున్నాయి. అలాగే కొత్తపాలెం గ్రామ పరిసరాల్లోని రైతులకు, గోనేపూడి పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు నిత్య ప్రయాణంలో ఇబ్బందులు తగ్గనున్నాయి.
రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా గోనేపూడి పాఠశాల విద్యార్థులు పవన్ కళ్యాణ్ను కలిసి రహదారి సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలకు క్రీడా మైదానం సహా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని వినతిపత్రం అందజేశారు.
గిరిప్రదక్షణ మార్గం లే అవుట్ పరిశీలన
త్రికోటేశ్వర స్వామి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో, కొండ చుట్టూ గిరిప్రదక్షణ మార్గం నిర్మాణానికి రూపొందించిన లే అవుట్ను ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు.
భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో, గిరిప్రదక్షణ మార్గం నిర్మాణానికి అవసరమైన అనుమతులు, ప్రణాళికలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
వనవిహారి జింకల పార్క్ సందర్శన
అనంతరం కోటప్పకొండ ఘాట్ రోడ్డులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనవిహారి జింకల పార్కును పవన్ కళ్యాణ్ సందర్శించారు. పార్కులోని మచ్చల జింకలకు స్వయంగా ఆహారం అందించారు.

పార్కులోని వృక్ష జాతులు, పక్షి జాతులు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన ట్రైన్ నిర్వహణపై అటవీ శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, జనసేన నరసరావుపేట ఇంచార్జ్ శ్రీ సయ్యద్ జిలాని, జిల్లా కలెక్టర్ శ్రీమతి కృత్తికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.